శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా మేజర్. 26/11 ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచడమే కాదు.. ఇప్పటికే ఈసినిమా ప్రివ్యూలు వేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు..అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ, తదితరులు
దర్శకత్వం.. శశి కిరణ్ తిక్క
బ్యానర్స్.. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్
నిర్మాతలు..మహేశ్బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
సంగీతం.. శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి.. వంశీ పచ్చిపులుసు
కథ..
సందీప్ ఉన్ని కృష్ణన్(అడివి శేష్) చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో పనిచేయాలనే తపనతో జీవిస్తుంటాడు. కానీ అతని తండ్రికి (ప్రకాశ్ రాజ్) కొడుకుని డాక్టర్ చేయాలని, తల్లికి (రేవతి) ఇంజినీరింగ్ చదివించాలని ఉంటుంది. కానీ చివరికి ఒప్పుకుంటారు. దానికోసం కష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అలా భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్ఎస్జీ (NSG) కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. మరోవైపు స్కూల్ డేస్లో ఇష్టపడిన ఇషా(సయీ మంజ్రేకర్)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరిమధ్య విభేదాలు వస్తాయి. చివరకు విడాకుల వరకు వెళతారు.ఇలా సాగుతుండగా.. ముంబై తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆ సమయంలో ‘51 ఎస్ఎస్ జీ’ బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్ హోటల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్ ఎలా మట్టుపెట్టాడు? హోటల్లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఉండవన్న సంగతి తెలిసిందే. నిజానికి కమర్షియల్ సినిమాలు తీయడం చాలా సులువే. ఇలాంటి కథలు తెరకెక్కించాలంటే కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వారి కుటుంబం నుండి అనుమవుతులు రావాలి. ఎంతో రీసెర్చ్ చేయాలి. అయితే అడివి శేష్ ఇవన్నీ ముందే చేసేశాడు. ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి.. అన్నీ అనుకున్న తర్వాత ఈసినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. ముంబై ఘటన అంటే అందరికీ తెలుసు కానీ ఈ ఘటనలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వీర మరణం చెందిన సందీప్ ఉన్ని కృష్ణన్ అంటే మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఈసినిమతో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి తెలియని విషయాలను భారతీయ ప్రేక్షకులకు తెరపై చూపించాడు.
ఇక దర్శకుడు శశి కిరణ్ కూడా కథను ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా ఆయన బాల్యం, లవ్స్టోరీతో పాటు దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమను, ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని చూపించారు. సెకండాఫ్లో మొత్తం 26\11 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్ హోటల్లో ఉగ్రవాదులు చేసిన అరాచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్ ఉన్నికృష్ణన్ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు చూపించారు. అంతేకాదు ఫస్టాఫ్ కూల్ గా సాగిపోయినా సెకండాఫ్ మాత్రం చాలా థ్రిలింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చివరిలో మాత్రం ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సందీప్ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోటుకు వెళ్లడం.. ఒంటినిండా బుల్లెట్లు ప్రాణాలు కోల్పోతున్నా చివరి క్షణం వరకు దేశరక్షణ కోసం పోరాడటం… క్లైమాక్స్లో ప్రకాశ్ రాజ్ స్పీచ్.. ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి.
ఇలాంటి సినిమాలకు కథే హీరో. అలా అని ఎవరు పడితే వాళ్లు చేసినా ప్రేక్షకులకు నచ్చుదు. కథకు తగ్గ హీరో కావాలి. ఆహీరోనే అడివి శేష్. సందీప్ ఉన్ని కృష్ణన్ మేకోవర్ కు అడివి శేష్ తప్పా మరొక హీరో సెట్ అవ్వడం అసాధ్యం. ఇక అడివి శేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించడం కంటే జీవించాడు అనే చెప్పాలి. నిజమైన సైనికుడి మాదిరి తన శరీరాన్ని మార్చుకున్నాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ కు దేశంపై తనకున్న ప్రేమను అడివి శేష్ తన పాత్ర ద్వారా చూపించగలిగాడు. ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్ చక్కగా నటించింది. శేష్, సయీ ముంజ్రేకర్ స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా బాగుంది. ఇక సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, రేవతి లాంటి నటీనటుల నుండి ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందీప్ తల్లీదండ్రులుగా ఇద్దరూ జీవించేశారు. ముఖ్యంగా సందీప్ తండ్రిగా ప్రకాశ్ రాజ్ అద్భుతంగా నటించాడు. ఆయన చెప్పే డైలాగ్స్ కంటతడి పెట్టిస్తాయి. ఈసినిమాలో మరో ముఖ్యమైన పాత్ర హైదరాబాద్ యువతి ప్రమోదారెడ్డిగా చేసిన శోభిత ధూళిపాళది. చిన్న పిల్లను కాపాడడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక మురళీ శర్మతో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధానమైన బలం శ్రీచరణ్ పాకాల సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని, ఖ్యాతిని వెండితెరపై మరోసారి ఆవిష్కరించారు. దేశం కోసం ఆర్మీ ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతుందో చూపించారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: