అద్భుత ప్ర‌ణ‌య దృశ్య‌కావ్యం ‘గీతాంజలి’కి మూడు ద‌శాబ్దాలు

30 Years For Nagarjuna Geetanjali Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Geetanjali Movie Completes 30 Years,30 Years oF Geetanjali Movie,Nagarjuna Geetanjali Movie Turns 30 Years,Geetanjali Telugu Movie Latest Updates
30 Years For Nagarjuna Geetanjali Movie

కొన్ని సినిమాలు క‌ళ్ళ‌ను తాకితే… మ‌రికొన్ని సినిమాలు మ‌న‌సుల‌ను మీటుతాయి. అలా… మ‌న‌సుల‌ను మీటే చిత్రాల‌కున్న ప్ర‌త్యేకత‌ ఏమిటంటే… ఒక్క‌సారి చూసినా చాలు జీవిత‌కాలం మ‌ధుర జ్ఞాప‌కాలుగా వెంటాడుతాయి. అలా వెంటాడే చిత్రాల‌లో లెజండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిరత్నం రూపొందించిన గీతాంజ‌లి ఒక‌టి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తను చనిపోతానని తెలిసినా… ప్రకృతి స‌మేతంగా ప్రతీ క్షణాన్ని ఒక అందమైన జన్మగా భావించి జీవితాన్ని ఆస్వాదిస్తూ… ఆ మృత్యువును సైతం అల్లరి పెట్టే ఓ అల్లరి పిల్ల జీవితమే ‘గీతాంజలి’ చిత్రం. దానికి హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీ జోడీంచి… మ‌ణిర‌త్నం మ‌ల‌చిన ఈ ప్ర‌ణ‌య దృశ్య‌కావ్యం… తెలుగునాట‌ ఓ క్లాసిక్‌గా నిలిచింది.

టైటిల్ రోల్‌లో నూత‌న న‌టి గిరిజ అభిన‌యానికి నాగార్జున స‌హ‌జ న‌ట‌న తోడై ఈ చిత్రాన్ని స‌జీవంగా నిలిపింది. అలాగే… మణిరత్నం ద‌ర్శ‌క‌త్వప్ర‌తిభ‌, మాస్ట్రో ఇళయరాజా స‌మ‌కూర్చిన సంగీతం, రాజ‌శ్రీ సంభాష‌ణ‌లు, పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం మరింత ప్లస్ అయ్యాయి. ఇక గీత‌ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలువారిన పాటలన్నీ అజరామరంగా నిలిచిపోయాయి. సాహిత్యపరంగా మంచి విలువలున్న ఆ పాటలకు తన సంగీతంతో ప్రాణం పోశారు ఇళయరాజా. ఆ గీతాల‌కు వెండితెరపై దృశ్యరూపం ఇచ్చి అందమైన దృశ్యకావ్యంగా ‘గీతాంజలి’ని మలిచారు సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్, దర్శకుడు మణిరత్నం. ముఖ్యంగా… “జల్లంత కవ్వింత”, “ఆమని పాడవే”, “ఓ పాపా లాలి” పాటలలో ఊటీ అందాలను ఎంత చక్కగా చూపించారో… “ఓ ప్రియా ప్రియా” పాటలో జైపూర్ సొగ‌సుల‌ను కూడా అంతే అద్భుతంగా ఆవిష్క‌రించారు శ్రీ‌రామ్‌.

ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లు చనిపోతారని తెలిసినా… ఆ ఇద్దరూ మృత్యువును హుందాగా ఎదుర్కోవడానికి సిద్ధపడిన వైనం… అలాగే కుటుంబ సభ్యులు కూడా సంయమనం పాటించిన విధానం ప్రతీ ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుంది. అందుకే క్లైమాక్స్‌లో “ఎంతకాలం బతుకుతారో తెలీదు. కాని బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు” అని స్క్రీన్ పై చూపించి సినిమాను ముగించడం… దర్శకుడికి ఆ జంటపై, ఆ కుటుంబ సభ్యులపై ఉండే ప్రేమను తెలియజేస్తుంది. ఇలా అంద‌రి హృద‌యాల‌ను తాకిన ‘గీతాంజలి’ 1989 మే 12న విడుద‌లై… నేటితో 30 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

‘గీతాంజలి’ – కొన్ని విశేషాలు:

  • తెలుగులో మ‌ణిర‌త్నం రూపొందించిన ఏకైక చిత్ర‌మిది. అలాగే… మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లోనూ, గిరిజ కాంబినేష‌న్‌లోనూ నాగార్జున న‌టించిన ఒకే ఒక సినిమా గీతాంజ‌లి.
  • ‘గీతాంజలి’ విడుద‌లైన సంవ‌త్స‌రంలోనే ‘శివ’ కూడా విడుద‌ల కావ‌డం… ఇలా ఒకే ఏడాదిలో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌ను అందుకోవ‌డంతో… నాగ్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
  • బెస్ట్ పాపులర్ ఫిలింగా నేషనల్ అవార్డును అందుకున్న‌ చిత్రం ‘గీతాంజలి’.
  • ఉత్తమ దర్శకుడుగా మణిరత్నం ఫిలింఫేర్‌ను అందుకున్న ఈ చిత్రానికి… ఉత్తమ చిత్రం, ఉత్తమ క‌థార‌చ‌యిత‌ (మణిరత్నం), ఉత్తమ హాస్య న‌టుడు (సుత్తివేలు) ఉత్తమ నృత్య ద‌ర్శ‌కుడు (సుందరం), ఉత్తమ క‌ళాద‌ర్శ‌కుడు (తోట తరణి), ఉత్తమ ఛాయాగ్రాహ‌కుడు (పి.సి.శ్రీరామ్) విభాగాల‌లో నంది అవార్డులు వరించాయి.
  • ఈ చిత్రాన్ని ‘యాద్ రఖేగి దునియా’(1992) పేరుతో హిందీలోనూ రీమేక్ చేసారు. అలాగే త‌మిళంలో ఇద‌య‌త్తై తిరుడాదే పేరుతో అనువాద‌మై… అక్క‌డా ప్ర‌జాద‌ర‌ణ పొందింది మ‌న గీతాంజ‌లి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =