విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తనకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు ధనుష్. ఇక ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా తిరుచిత్రంబలం. తెలుగులో ఈసినిమాను తిరు పేరుతో రిలీజ్ చేయనున్నారు. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో వస్తున్నఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ధనుష్, నిత్యామీనన్,రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్, భారతీరాజా తదితరులు
దర్శకత్వ.. మిత్రన్ జవహర్
నిర్మాతలు.. కళానిధి మారన్
బ్యానర్స్.. సన్ పిక్చర్స్ పతాకం
సంగీతం.. అనిరుథ్ చంద్రన్
సినిమాటోగ్రఫి.. ఓం ప్రకాష్
కథ..
తిరు ఏకాంబరం అలియాస్ పండు (ధనుష్) ఒక మధ్యతరగతి జీవనం సాగిస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి (పకాష్ రాజ్) తాత (భారతీరాజా) తో కలిసిఉంటాడు. అయితే చిన్నప్పటి నుండి చదువు పెద్దగా రాకపోవడంతో ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే ఆపార్ట్ మెంట్ లో ఉండే శోభన (నిత్యామీనన్) పండు మంచి స్నేహితులు. ఏ విషయమైనా ఇద్దరూ ఒకరికొకరు సపోర్టు చేసుకుంటూ వెన్నుదండుగా ఉంటారు. ఇదిలా ఉండగా పండు అనూష(రాశీ ఖన్నా) ప్రేమలో పడతాడు. అయితే ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. ఇక మరోవైపు అకస్మాత్తుగా తిరు తండ్రికి గుండె పోటు వస్తుంది. ఈ విషాదాలతో జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాడు. మరి చివరికి పండు తన సమస్యల నుండి ఎలా బయటపడతాడు.. నిజమైన ప్రేమ పండుకు దొరికిందా లేదా అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ..
మధ్య తరగతి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక తమ జీవితం పై విసుగుచెంది లైఫ్ లీడ్ చేసే హీరో పాత్రలు ఎన్నో చూశాం. ఇక ఈసినిమాలో కూడా ధనుష్ ది మధ్య తరగతి జీవితం. ధనుష్ ఇలాంటి కథతో వచ్చి చాలా రోజులే అయిపోయింది. స్నేహం, ప్రేమ, కుటుంబాలలో భావోద్వేగ బంధం మరియు పోరాటాలు ఇలాంటి ఎలిమెంట్స్ తో మెప్పించే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఇలాంటి పాత్రలు ధనుష్ కు కూడా కొత్తేమి కాదు. ఎమోషనల్ సీన్స్ పండించడం.. అలానే సాధారణ యువకుడిగా, కామెడీని పండించటం ఇలాంటి పాత్రలు చేయడం ధనుష్ కు కొట్టిన పిండి. ఈసినిమాలో కూడా పండు పాత్రలో ఒదిగిపోయి నటించాడు.
నిత్యా మీనన్ కు కూడా మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. ధనుష్, నిత్యా మీనన్ బంధం ఈ చిత్రంలో హైలెట్. వీరిద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం.. స్నేహం గొప్పతనం వీరి పాత్రల ద్వారా తెలియచేశారు. ఇక ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రల్లో ఎలా నటిస్తారో తెలిసిందే. ఈసినిమాలో కూడా తండ్రి పాత్రలో అదరగొట్టారు. అలాగే తాత పాత్రను పోషించిన భారతీ రాజా కూడా ఆకట్టుకున్నారు. తాత, మనవడి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రాశీ ఖన్నా, ప్రియ భావానీ శంకర్ ఇద్దరు హీరోయిన్లుగా నటించినా.. రాశీ ఖన్నాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియా భవానీ పాత్ర నిడివి తక్కువే.
కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను మిత్రన్ తెరకెక్కించిన విధానం బాగుంది. భావోద్వేగాలను బాగా చిత్రీకరించాడు. పెద్ద హడావుడి లేకుండా ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా చాలా సింపుల్ గా ఈకథను రాసుకున్నాడు. ఇక నటీనటులు తమ పెర్ఫామెన్స్ సినిమాను సక్సెస్ చేశారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం ప్రధాన బలం. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. అంతేకాదు ఇళయరాజా ఫ్లేవర్ కూాడా అక్కడక్కడ కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ మంచి విజువల్స్ను అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: