జానపదం, పౌరాణికం, చారిత్రకం, సాంఘికం… ఇలా జానర్ ఏదైనా తనదైన నటనాపాటవంతో ప్రేక్షకులను అలరించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన నటవారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా జానర్లలో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అటువంటి ఆసక్తితో… ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘భైరవద్వీపం’. జానపద చిత్రాలు కనుమరుగైపోతున్న తరుణంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చక్కటి కథ, కథనాలతో ఆబాలగోపాలాన్ని అలరించేలా ఈ జానపద చిత్రాన్ని తెరకెక్కించారు. అలనాటి మేటి జానపద చిత్ర రాజం ‘పాతాళ భైరవి’(1951) స్పూర్తితో రూపుదిద్దుకున్న ఈ కమనీయ, రమణీయ దృశ్యకావ్యాన్ని చందమామ విజయా కంబైన్స్ పతాకంపై బి.వెంకటరామిరెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణకి జోడీగా రోజా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ్ కుమార్, కె.ఆర్.విజయ, పద్మనాభం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. యక్షిణిగా రంభ కీలక పాత్రలో నటించింది. ఇక మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. చిత్రంలో సందర్భోచితంగా వచ్చే ప్రతీ గీతం సినిమాకి మరింత ఊపిరిపోసింది. “విరిసినది వసంతగానం”, “ఎంత ఎంత వింత మోహమో”, “ఘాటైన ప్రేమ ఘటన”, “నరుడా ఓ నరుడా”, “శ్రీ తుంబుర నారద” ఇలా పాటలన్నీ సంగీతపరంగానూ, సాహిత్యపరంగాను సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 14, 1994న విడుదలైన `భైరవద్వీపం` నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
‘భైరవద్వీపం’ – కొన్ని విశేషాలు:
* బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రమిదే. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో `బొబ్బిలి సింహం`, `పెద్దన్నయ్య` వంటి జనరంజక చిత్రాలతో పాటు `గాండీవం`, `మాతో పెట్టుకోకు`, `శ్రీకృష్ణార్జున విజయం`, `సుల్తాన్` వంటి సినిమాలు కూడా రూపొందాయి.
* అలాగే… రంభ కూడా తొలిసారిగా బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత బాలయ్య, రంభ జంటగా ‘మాతో పెట్టుకోకు’ రూపుదిద్దుకుంది. అదే విధంగా… `శ్రీకృష్ణార్జున విజయం`లో ఓ ప్రత్యేక గీతంలో రంభ కనువిందు చేసింది. ఈ మూడు చిత్రాలలోనూ రోజా కూడా నటించడం విశేషం.
* బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో రెండో సినిమా ఇది. సైంటిఫిక్ (‘ఆదిత్య 369’), జానపదం (‘భైరవద్వీపం’), పౌరాణికం (‘శ్రీకృష్ణార్జున విజయం’)… ఇలా డిఫరెంట్ జానర్లలో వీరి కాంబినేషన్ మూవీస్ రావడం విశేషం.
* బాలకృష్ణ, మాధవపెద్ది సురేష్ కలయికలో వచ్చిన తొలిచిత్రమిదే. ఆ తర్వాత బాలయ్య కాంబినేషన్లో ‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ వంటి చిత్రాలకు సురేష్ సంగీతం అందించాడు.
* పూర్తిస్థాయి 3డి గ్రాఫిక్స్ తో నిర్మించిన తొలి భారతీయ జానపద చిత్రరాజం `భైరవద్వీపం`.
* వైజాగ్ లో 100 రోజులు హౌస్ పుల్స్ తో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక జానపద సినిమా.
* తిరుపతిలో 5 ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక జానపద చిత్ర రాజం `భైరవద్వీపం`.
* ఆంధ్ర , కర్ణాటక, ఒరిస్సా … ఇలా మూడు రాష్ట్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక సినిమా `భైరవద్వీపం`.
* పుల్ ట్యాక్స్ లో సీడెడ్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర, నెల్లూరు, కర్ణాటక, ఒరిస్సా లలో ఆల్ టైం రికార్డు షేర్ వసూల్ చేసిన ఏకైక సినిమా `భైరవద్వీపం`.
* ఇక `నంది` అవార్డుల విషయానికొస్తే… ఉత్తమ తృతీయ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా (సింగీతం శ్రీనివాసరావు), ఉత్తమ మేకప్ మాన్గా (ఎం.సత్యం), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా (కొండల రెడ్డి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ (కొల్లి రామకృష్ణ), ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా (పేకేటి రంగా), ఉత్తమ గాయనిగా ఎస్.జానకి (“నరుడా ఓ నరుడా”), ఉత్తమ గాయకుడిగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (“శ్రీ తుంబుర నారద”) … ఇలా పలు పురస్కారాలు ఈ సినిమాని వరించాయి. అలాగే… ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డును కబీర్ లాల్ అందుకున్నారు.
[subscribe]
[youtube_video videoid=Beb6rhfh8Ew]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: