“జాతస్య మరణం ధృవం”- అంటారు. మనిషి పుట్టినప్పుడే మరణం కూడా ధ్రువీకరించబడి ఉంటుందట. మధ్యలో మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా మృత్యువన్నది వచ్చే ఏ సమయానికే వస్తుంది… తీసుకుపోతుంది. అందుకే చావు గురించి మనసు కవి ఆత్రేయ చక్కని చమత్కారం ఒకటి విసిరేవారు.” చావుకు నేనంటే చచ్చే భయం…. నేను బతికున్నంత వరకు అది నా దగ్గరికి రాదు… అది వస్తే నేను బతికి ఉండను” అని. ప్రస్తుతం ఈ మృత్యు ప్రస్తావన ఎందుకు? ఏమిటి? అనుకుంటున్నారు కదూ.
తీవ్ర అస్వస్థతకు గురై దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి మృత్యు ముఖాన్ని ముద్దాడి ప్రాణాపాయం నుండి తప్పించుకుని క్షేమంగా ఇంటికి వచ్చిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఇంటికి వెళ్లి పరామర్శించింది”ది తెలుగు ఫిలిం డాట్ కాం”.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి తన ఆకస్మిక అస్వస్థతకు కారణాన్ని, ఆ తరువాత జరిగిన ట్రీట్మెంట్ ను గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.
గత సార్వత్రిక ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి కి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా సంచలనాత్మక ప్రకటనలు చేసి, ప్రచారం చేసి తీరా ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వెలువడుతుండగా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి రాత్రి 2 గంటల సమయంలో తీవ్రమైన జ్వరం వచ్చిందట.105 డిగ్రీల జ్వరంతో యశోద హాస్పటల్ లో చేరిన పోసానికి డాక్టర్లందరూ మంచి మిత్రులు, సన్నిహితులు కావడంతో చాలా మంచి ట్రీట్ మెంట్ జరిగింది. అయినా జ్వరం తగ్గటం లేదు… మనిషి నీరసం అయిపోయాడు… బాత్రూంకు కూడా ఇద్దరు మనుషులు మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి..
ఏం జరుగుతుందో, అస్వస్థతకు కారణం ఏమిటో డాక్టర్లు గుర్తించలేకపోయారట. అటు డాక్టర్లకు ఇటు కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రోజురోజుకు పరిస్థితి క్షీణిస్తుంది. అలాంటి తరుణంలో అమెరికా యాత్ర ముగించుకుని తిరిగివచ్చిన సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ ఎం వి రావు గారు పోసాని పరిస్థితి చూసి తక్షణమే శరీరం మొత్తాన్ని స్కానింగ్ చేయించారట. అప్పుడు బయటపడిందట వీపుకి నడుముకి మధ్య భాగంలో పెరుగుతున్న ఒక ఇన్ఫెక్షన్ కణితి. వెంటనే ఆపరేషన్ చేసి తీసేసారు. దాన్ని తొలగించిన మరు క్షణం నుండే పోసాని ఆరోగ్యం మెరుగు పడటం ప్రారంభమైంది.
“డాక్టర్ ఎం వి రావు గారు దేవుడి లాగా సకాలంలో వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ను గుర్తించి ఉండకపోతే ఇంకొక వారం రోజుల్లో ఈ పోసాని ఉండేవాడు కాదన్నా.. అంటూ చేతులు జోడించి డాక్టర్ ఎమ్ వి రావు గారికి కృతజ్ఞతలు చెప్పాడు పోసాని.
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పోస్ట్ ఆపరేషనల్ డిప్రెషన్ ఏర్పడుతుంది కాబట్టి షూటింగ్ లకు వెళ్లండి అని డాక్టర్ సూచించడంతో మరలా “ లైట్స్ ఆన్ – స్టార్ట్ కెమెరా- యాక్షన్”-అనే షూటింగ్ వాతావరణంలోకి ఎంటరయ్యారు పోసాని.
ఇదీ… పోసాని కృష్ణ మురళి మృత్యువును ముద్దాడి వచ్చిన కథా కమామీషు.
“మరి వైఎస్ఆర్సిపి అధికారం లోకి వచ్చింది… జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు… పార్టీకి సేవలందించిన అందరికీ మంచి మంచి పదవులు ఇస్తున్నారు…. మీ సహ నటుడు పృథ్వి కి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు… మరి పోసానికి ఏ పదవి ఇస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు..
మరి మీరు ఏమి ఆశిస్తున్నారు” – అని అడగ్గా – “ఏ పదవి, ప్రతిఫలమూ ఆశించి నేను చేయలేదు… వాటి గురించి నేను ఆలోచించలేదు” అని సమాధానం ఇచ్చారు.
అడిగినా అడక్కపోయినా… ఆశించినా ఆశించకపోయినా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ మురళికి ఏ పదవిని బహుమానంగా ఇస్తారో చూద్దాం.
[youtube_video videoid=J304eYUwdqE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: