ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న వేకువఝామున కన్నుమూశారు. కడసారి చూపునకు తరలివచ్చిన తోటి నటీనటులు ఆయన పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. అశ్రునయనాల మధ్య కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ఇక ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలు పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. అలాగే ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ సహా పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఘనంగా నివాళులు అర్పించారు.
మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమ ఒక లెజెండరీ నటుడిని కోల్పోయింది. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారిపై ప్రత్యేక కథనం.. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి పేర్లలో ఒకటి కోట శ్రీనివాసరావు గారి పేరు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో వైదుడు సీతారామాంజనేయులు, సుశీల దంపతులకు జనించారు కోట శ్రీనివాసరావు. విద్యాభ్యాసం తర్వాత స్టేట్ బ్యాంకులో పనిచేశారు.
అయితే నటనపై మక్కువతో రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1978లో ‘ ప్రాణం ఖరీదు’ చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయమైన కోట, మొత్తం నాలుగు దశాబ్దాల కెరీర్ లో మొత్తం 750కి పైగా సినిమాలలో నటించారు. ఈ క్రమంలో విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ – ఇలా అనేక రూపాల్లో తన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే అద్భుత నటుడు ఆయన. మాటలతో, మాండలికంతో ప్రేక్షకులను మాయచేసి మంత్రముగ్ధుల్ని చేసేవారు కోట. ముఖ్యంగా ఆయన ప్రత్యేకత ఏమిటంటే.. నటనలో హావభావాలు, సంభాషణల తీరు అన్నీ అత్యంత సహజంగా ఉండేవి. తన ప్రత్యేక శైలిలో చెప్పే డైలాగులతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఒక్క డైలాగ్తో ప్రేక్షకుల మనసుల్ని నిండేసే కళ ఆయనలో ఉందని అనేకమంది దర్శకులు చెబుతారు.
ఇక కోట శ్రీనివాసరావు గారు కొంతకాలంపాటు రాజకీయాల్లోనూ రాణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999-2004 కాలం మధ్య భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలపైనే దృష్టి సారించారు.
కోట శ్రీనివాసరావు వ్యక్తిగత జీవితానికొస్తే, ఆయనకు భార్య రుక్మిణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఆంజనేయ ప్రసాద్ ఉన్నారు. అయితే ఆంజనేయ ప్రసాద్ 2010 జూన్ నెలలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన ‘సిద్ధం, గాయం 2’ సినిమాలలో నటించాడు. తనయుడి మరణంతో కోట తీవ్రంగా కృంగిపోయారు. వయసు కూడా మీద పడటంతో సినిమాలలో నటించడం కూడా తగ్గించేశారు.
కాగా కోట శ్రీనివాసరావు గారు నంది అవార్డులు, రాష్ట్ర స్థాయి గౌరవాలు, అలాగే పద్మశ్రీ పురస్కారం కూడా పొందారు. అది ఆయన నటనా పటిమకు దేశం ఇచ్చిన గౌరవం. కోట గారు సంగీతం, సాహిత్యం పట్ల కూడా మంచి అభిమానం ప్రదర్శించేవారు. ఈ తరం నటులకు స్ఫూర్తిగా నిలిచిన కోట గారు, పాత్రల పరిమితిని దాటి నటనా శిల్పిగా ఎదిగారు. ఆయన జీవితం, అభినయం, సంభాషణలు… ఇవన్నీ కలిపి తెలుగు సినిమాకు ఒక పాఠశాల లాంటివి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























