భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ గెలుచుకొన్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగువారెవరికీ చోటు దక్కలేదన్న బాధను తీర్చేశారు. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా.. బెస్ట్ నేషనల్ యాక్టర్ విజేతగా అల్లు అర్జున్ పేరు వెలువడిన వెంటనే టాలీవుడ్ లో సంబరాలు అంబరాన్నంటాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనబరచిన అభినయం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ అభిమానులని మంత్రముగ్ధుల్ని చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ గెలుచుకొన్న నేపథ్యంలో.. పుష్ప మూవీ టీమ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్ర దర్శకుడు సుకుమార్, నిర్మాతలు అల్లు అర్జున్ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. ఒకరినొకరు గట్టిగా కౌగింలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే బన్నీకి తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు తల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి కూడా భర్తని హగ్ చేసుకుని విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంట సందడి నెలకొంది. అలాగే పలువురు అల్లు అభిమానులు ఆయన ఇంటి వద్దకు వచ్చి బాణాసంచా కాల్చి తమ హీరో సాధించిన ఘనతను ఘనంగా సెలబ్రేషట్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు తెలుగు చిత్రసీమ నుంచి అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో బన్నీకి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
కాగా గత 69 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని కలగా మిగిలిన ఈ అవార్డును అందుకోవడం ద్వారా అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో శాశ్వతంగా చెరగని ముద్ర లిఖించారు. తొలితరం నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు కానీ.. ఆ తర్వాతి తరం అగ్ర హీరోలుగా వెలుగొందిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కానీ.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హేమాహేమీలెవ్వరికీ సాధ్యపడని రీతిలో అల్లు అర్జున్ ఈ అవార్డు గెలుచుకోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది విశ్వవేదికపై ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగురవేసిన అద్భుతఘట్టం స్మృతిపథంలో కదలాడుతుండగానే తాజాగా తెలుగు సినిమా కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరినట్లయింది.
ఇక డిసెంబర్ 17, 2021న విడుదలైన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ చూపించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ‘తగ్గేదేలే’ అంటూ సినిమా మొత్తం వన్మ్యాన్ షోగా రక్తి కట్టించారు అల్లు అర్జున్. మాస్ లుక్లో ఆయన మేకోవర్, నటనాపరంగా కనబరచిన వేరియేషన్స్, చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు హైలైట్గా నిలిచాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. మరో విశేషమేంటంటే..? హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా అసాధారణ కలెక్షన్స్ అందుకోవడం. కాగా ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ చిత్రం 365 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులని ఔరా అనిపించింది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటించగా, ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండవ భాగం షూటింగ్ జరుపుకుంటోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: