గీత రచయితగా ఆయన ప్రస్థానం 70వ దశకం ప్రథమార్థంలో ప్రారంభమైనప్పటికీ ద్వితీయార్థం చివరిలోనే ఆయన ప్రభ ప్రారంభమైంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు చిత్రంలోని “కృషివుంటే మనుషులు రుషులవుతారు” పాటలోని అర్ధ పరమార్ధంలకు అద్దం పట్టినట్లుగానే కృషితో ఋషిగా ఎదిగి తెలుగు సినిమా పాటకు చిరునామా అయ్యారు వేటూరి సుందరరామ్మూర్తి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అప్పటికి దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినీ గీత రచనా వ్యాసంగంలో ఉద్దండులైన మహా రచయితలు ఎందరెందరో ఉన్నప్పటికీ వేటూరి సుందర రామ్మూర్తికి వచ్చినంత వేగవంతమైన ప్రాచుర్యం మరే ఇతర రచయితకు దక్కలేదు. వేటూరి పాటల్లోని సాహిత్య సౌందర్యాన్ని, భావ ఔన్నత్యాన్ని గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. కానీ అతి తక్కువ కాలంలోనే తెలుగు పాటకు చిరునామాగా, యువ గీత రచయితలకు స్ఫూర్తి ప్రదాతగా వేటూరి ఎలా ఎదిగారు.? అనే కోణంలో ఆలోచిస్తే అందుకు ప్రధాన కారణం… “వేటూరి అంటే వేగం” అని నిర్మాత భావించటమే.
[custom_ad]
పాట రాయటానికి నానా పాట్లు పడుతూ నిర్మాతలను ఇక్కట్ల పాలు చేసే వారిలో గీత రచయితలదే ప్రథమ స్థానం అనే అపప్రద ఉన్న తరుణంలో పావుగంటలో పాట రాసి “నిర్మాతల లిరిసిస్ట్” గా పేరు తెచ్చుకున్నారు వేటూరి సుందరరామ్మూర్తి. చిత్ర నిర్మాణం నత్తనడకగా నడిచిన తొలిరోజుల్లో అలాంటి ఆలస్యాన్ని, అలక్ష్యాన్ని నిర్మాతలు భరిస్తూ వచ్చారు కానీ నిర్మాణ వేగం పెరిగిన తరువాత మాట అయినా, పాట అయినా సకాలంలో అందించగలిగిన సృజనాత్మక రచయితలకే ప్రాధాన్యత ఇచ్చింది చిత్ర పరిశ్రమ. అలాంటి తరుణంలో గీత రచయితగా వేగం, భావం, భాష, చమత్కారం ఆయుధాలుగా దూసుకొచ్చిన “లిరికల్ ఎక్స్ ప్రెస్స్” వేటూరి సుందరరామ్మూర్తి. ముఖ్యంగా 80, 90 దశకాలలో వేటూరి సుందరరామ్మూర్తి నుండి వచ్చినంత వేగంగా మరే ఇతర గీత రచయిత నుండి పాట రాలేదు.
[custom_ad]
వేటూరి పాటకు అగ్ర నిర్మాతలు, అగ్ర దర్శకులు, అగ్ర కథానాయకులు , గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళు, చిన్నవాళ్లు అనే భేదం తెలియదు. గీతార్ధులై వచ్చిన ప్రతి ఒక్కరికి సందర్భోచిత, సమయోచిత గీతాలను సకాలంలో అందించిన అక్షర శ్రామికుడు వేటూరి సుందరరామ్మూర్తి. అందుకే లెక్కకు నాలుగు దశాబ్దాల ప్రస్థానమే అయినప్పటికీ కేవలం మూడు దశాబ్దాలలోనే ఐదు వేలకు పైగా పాటలు రాసి The Best and the fastest Lyricist అనే క్రెడిట్ దక్కించుకున్నారు వేటూరి.
1936 జనవరి 29న జన్మించిన వేటూరి పూర్వాశ్రమంలో ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా పని చేశారు. సుప్రసిద్ధ దర్శక రచయితలు బాపు- రమణ ఆయన సహోద్యోగులు. జర్నలిస్టుగా భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ను ఇంటర్వ్యూ చేసిన తొలి చివరి జర్నలిస్ట్ అనే క్రెడిట్ దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్ వేటూరి సుందరరామ్మూర్తి.
[custom_ad]
1974లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ చిత్రం లో ఒక బ్యాలే రాయటం ద్వారా గీత రచయితగా పరిచయమైన వేటూరి సుందరరామ్మూర్తి అడవి రాముడు చిత్రానికి పాటలు రాయడంతో విశేష ప్రాచుర్యాన్ని పొందారు. ఆ తరువాత సిరిసిరిమువ్వ, పంతులమ్మ, గోరింటాకు, శంకరాభరణం, సీతాకోకచిలుక, శుభలేఖ, మేఘసందేశం, ప్రతిఘటన, గీతాంజలి , జగదేకవీరుడు అతిలోకసుందరి, చంటి, మాతృదేవోభవ, సుందరకాండ వంటి వందలాది చిత్రాలకు వేలాది పాటలు రాసి రెండు దశాబ్దాల పాటు ప్రేక్షక శ్రోతలను ఉర్రూతలూగించారు.
ఆనాటి సీనియర్ డైరెక్టర్స్ తో పాటు యువతరం దర్శకులు ఎందరికో పాటలు రాసి ప్రోత్సహించి అందరి హృదయాలలో గురు స్థానాన్ని సంపాదించుకున్న పుంభావ సరస్వతి వేటూరి సుందర రామ్మూర్తి ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ ఆ సినీ గీత హిమోన్నతానికి జోహార్లు అర్పిస్తుంది
“ద తెలుగు ఫిలింనగర్ డాట్ కాం”.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: