మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన స్వరకర్తలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. `బావగారూ బాగున్నారా?`, `చూడాలని వుంది`(1998), ఇద్దరు మిత్రులు (1999), అన్నయ్య (2000), మృగరాజు (2001), ఇంద్ర (2002), ఠాగూర్ (2003), అంజి (2004), జై చిరంజీవ! (2005), స్టాలిన్ (2006)… ఇలా వరుసగా తొమ్మిదేళ్ళ పాటు ఈ ఇద్దరి కలయికలో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… 13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి జట్టుకట్టనుందట. ఆ వివరాల్లోకి వెళితే… కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే మణి బాణీలు అందించనున్నాడని టాక్. వాస్తవానికి, ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీతదర్శక ద్వయం అజయ్ – అతుల్ స్వరాలు అందిస్తారని ప్రచారం సాగింది. అయితే… `చిరు 152` టీమ్ మణి వైపే మొగ్గు చూపిస్తుందట. రీసెంట్ బ్లాక్బస్టర్ `ఇస్మార్ట్ శంకర్`తో మణి బౌన్స్ బ్యాక్ కావడమే కాకుండా… ఆ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ నేపథ్యంలోనే… మణిశర్మ అయితేనే బావుంటుందని చిత్ర బృందం భావిస్తుందట. అంతేకాదు… నేపథ్య సంగీతానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో, రీరికార్డింగ్ లో దిట్ట అయిన మణి అయితేనే జస్టిస్ జరుగుతుందని… ఈ వెటరన్ మ్యూజిక్ కంపోజర్ ని ఎంచుకున్నారట. త్వరలోనే మణి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా… కొరటాల శివ గత నాలుగు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాదే బాణీలు అందించాడు. శివ, మణి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం.
`చిరు 152`ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: