సౌందర్య… నిన్నటి తరం అందమైన సినీ జ్ఞాపకం. అందం, అభినయం మెండుగా ఉన్న అందాల తార ఆమె. ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి… ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన ఆమె సొంతం. ఇక భావోద్వేగ సన్నివేశాల్లో అయితే సౌందర్య నటన అపూర్వం, అద్వితీయం. అందుకే… తెలుగు సినీ ప్రేక్షకులు ఆమెను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆమె సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటే… ఈ అందాల భరిణె అసలు పేరు సౌమ్య. 1972, జూలై 18న కన్నడ కుటుంబంలో జన్మించింది. తండ్రి కె.ఎస్.సత్యనారాయణ రచయిత, నిర్మాత కావడంతో సినీ రంగంపై మక్కువ పెంచుకుంది సౌందర్య. కన్నడ చిత్రం ‘నన్నైతాంగి’(1992)తో సౌందర్యగా వెండి తెరకు పరిచయమై… సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘రైతు భారతం’తో టాలీవుడ్లో మొదటి అడుగు వేసింది. అయితే… దానికంటే ముందు విడుదలైన ‘మనవరాలి పెళ్ళి’తో ప్రేక్షకులకు పరిచయమైనా… నటకిరీటి రాజేంద్రప్రసాద్, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది.
అలాగే… నాగార్జున హీరోగా నటించిన ‘హలోబ్రదర్’ సినిమాతో కమర్షియల్ హీరోయిన్గా కూడా గుర్తింపు సంపాదించుకుంది సౌందర్య. ఆపై ‘అమ్మోరు’, ‘పవిత్ర బంధం’, ‘పెళ్ళి చేసుకుందాం’, ‘చూడాలని ఉంది!’, ‘అంతః పురం’, ‘రాజా’ వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి అనతికాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా… కోలీవుడ్, బాలీవుడ్లలో కూడా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది సౌందర్య. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, విష్ణు వర్థన్… ఇలా భాషాబేధం లేకుండా పలువురు అగ్ర కథానాయకులతో కలసి నటించి మెప్పించింది.
అంతేకాదు… ఓ పక్క స్టార్ హీరోయిన్ హోదాలో పెద్ద సినిమాల్లో నటిస్తూనే… మరోపక్క చిన్న సినిమాల్లో కూడా తన మార్కు అభినయంతో ఆ సినిమాల విజయానికి దోహద పడింది. నటిగా ఎన్నో అవార్డులను, రివార్డులను గెలుచుకున్న ఆమెని… “సావిత్రి ఆఫ్ మోడరన్ తెలుగు సినిమా”గా తెలుగు ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇంతగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఈ నటి శిరోమణి… 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.
అప్పట్లో బీజెపి తరఫున ప్రచారం కోసం వెళ్తూ… 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిందీ తెలుగువారి అభిమాన నటి. పుష్కరకాలంగా సాగిన తన అభినయ పర్వంలో దాదాపు 108 సినిమాల్లో విభిన్న భూమికలు పోషించి… ప్రేక్షకుల మెప్పు పొందిన సౌందర్య ఇక లేదని, రాదని తెలిసి దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమతో పాటు… యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సౌందర్య భౌతికంగా దూరమై దశాబ్దన్నర కాలం కావస్తున్నా… ఆమె పోషించిన పాత్రలు మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
[subscribe]
[youtube_video videoid=qLlZlScsnYA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: